×

జూన్ 9 వ తేదీన సాయంత్రం భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం

ముచ్చటగా మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. జూన్ 9 వ తేదీన సాయంత్రం భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారు. కాగా.. ఈ ప్రమాణ స్వీకార వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే.. ప్రధానమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎన్డీఏ కూటమిలోని నేతలు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు, సినీ క్రీడా బిజినెస్ ప్రముఖులతో పాటు.. పొరుగు దేశాల అధినేతలకు కూడా ఆహ్వానాలు అందాయి. ఈ వేడుకకు సుమారు 7000 నుంచి 8000 మంది హాజరుకానున్నట్టు సమాచారం.

ఈ క్రమంలోనే.. మోదీ ప్రమాణ స్వీకారానికి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌  కూడా ఆహ్వానం అందింది... తాజా మాజీ కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ.. ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా.. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కేసీఆర్‌కు ప్రహ్లాద్ జోషి స్వయంగా ఫోన్ చేసి ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అయితే... మోదీని తీవ్ర స్థాయిలో విమర్శించిన కేసీఆర్.. ప్రమాద స్వీకరానికి హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరోవైపు.. ఆదివారం సాయంత్రం ఢిల్లీలో జరగనున్న ప్రమాణ స్వీకార వేడుకకు కొందరు ప్రత్యేక వ్యక్తులను కూడా బీజేపీ ఆహ్వానించింది. గతేడాది పూర్తయిన కొత్త పార్లమెంటు భవన నిర్మాణంలో పాల్గొన్న శ్రామికులు, పారిశుద్ధ్య కార్మికులు, వందే భారత్ సహా రైల్వే శాఖలోని కీలక ప్రాజెక్టుల్లో పనిచేసిన వారు, పలువురు ట్రాన్స్‌జెండర్లను కూడా మోదీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించటం విశేషం. దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్న ఇలాంటి రంగాల వారిని నరేంద్ర మోదీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించటం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

  • June 09 , 2024
  • 09:44 am