×

రూ. 2 కోట్ల విలువైన టీటీడీ ఎలక్ట్రిక్ బస్సు చోరీ

 

తిరుమల కొండ మీద దొంగలు పడ్డారు. అయితే దొంగలు కొట్టేసింది భక్తుల ఫోన్లో, షాపింగ్ కాంప్లెక్స్‌ల్లోని వస్తువులో కాదు. ఏకంగా ఓ ఎలక్ట్రిక్ బస్సును. తిరుమల కొండ మీద భక్తుల ఉచిత ప్రయాణం కోసం టీటీడీ ఉపయోగించే ధర్మరథాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఆదివారం వేకువజామున 3.30 గంటల సమయంలో డిపోలో నిలిపి ఉంచిన ఎలక్ట్రిక్ బస్సును దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ బస్సు విలువ రూ.2 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.

తెల్లవారు జామున తిరుమల జీఎన్సీ టోల్ గేట్ మీదుగా తిరుపతికి వస్తున్న బస్సును.. టోల్‌ గేట్ వద్ద ఉండే టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఆపకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఉదయం నుంచి ఉచిత బస్సు టీటీడీ డిపోలో లేకపోవడంతో తిరుమలలోని అన్ని ప్రాంతాలను సిబ్బంది తనిఖీ చేసి.. బస్సు చోరీకి గురైనట్లు నిర్ధారణకు వచ్చారు. దీంతో తిరుమల క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి‌ పోలీసులు జీపీఎస్ ఆధారంగా బస్సు కదలికలను గుర్తించారు. ఉచిత బస్సు తిరుపతి జిల్లా నాయుడుపేట వద్ద ఉన్నట్లు క్రైం పోలీసులు గుర్తించారు. బస్సును స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

  • September 24 , 2023
  • 12:00 pm