×

వందేభారత్‌లో 14 నిమిషాల అద్భుతం.. నేటి నుంచే ఆరంభం !!

కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సెమీ-హైస్పీడ్ రైలు వందేభారత్‌ విషయంలో మరో కీలక మార్పు చోటుచేసుకుంది. వందేభారత్ రైళ్లను కేవలం 14 నిమిషాల్లోనే శుభ్రం చేసి, తదుపరి ప్రయాణానికి సిద్ధం చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ‘14 నిమిషాల అద్భుతం’ పేరుతో ఆదివారం నుంచి ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తోన్న 29 వందేభారత్‌ రైళ్లలో దీనిని అమలు చేయనుంది. జపాన్‌లోని టోక్యో, ఒసాకా వంటి స్టేషన్లలో బులెట్‌ రైళ్లను కేవలం ఏడు నిమిషాల్లోనే శుభ్రం చేస్తుంటారు. వాటిని ప్రేరణగా తీసుకుని వందేభారత్ రైళ్ల శుభ్రత సమయ పరిమితిని నిర్దేశించుకున్నారు.

ఢిల్లీ కంటోన్మెంట్‌ రైల్వే స్టేషన్‌లో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఆదివారం దీనిని స్వచ్ఛత హే సేవ పేరుతో లాంఛనంగా ప్రారంభిస్తారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో శుభ్రపరిచే ప్రక్రియను క్రమబద్ధీకరించి.. వాటిని మరింత సమర్థవంతంగా రికార్డు సమయంలో తమ తదుపరి ప్రయాణానికి సిద్ధంగా ఉంచడమే లక్ష్యమని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ‘ప్రస్తుతం వందే భారత్ రైలును శుభ్రం చేయడానికి దాదాపు 45 నిమిషాలు పడుతుంది... ఇప్పుడు మరింత స్ట్రీమ్‌లైన్డ్ వర్క్‌ఫ్లో కోసం చూస్తున్నాం.. రైలు కేవలం 14 నిమిషాల్లో శుభ్రం చేసి సిద్ధం చేయడానికి ఒక్కో కోచ్‌కు ముగ్గురు క్లీనింగ్ సిబ్బంది పని చేస్తారు... ఈ కొత్త ప్రయత్నం 100% సమర్థవంతంగా ఉంటుంది’ అని అధికారి చెప్పారు.

ఈ కొత్త ప్రక్రియ గురించి రైల్వే అధికారిని ప్రశ్నించగా.. ‘భారతీయ రైల్వేలు నిరంతరం మెరుగుపడాలి.. ప్రపంచ అత్యుత్తమ ప్రమాణాలను సాధించాలని చూస్తున్నాయి.. అందువల్ల అంతర్జాతీయంగా అనుసరించే అసాధారణమైన పద్ధతుల నుంచి ఇది ప్రేరణ పొందింది’ అని పేర్కొన్నారు. ‘ఆసక్తికరంగా జపాన్‌లో బుల్లెట్ రైళ్లను శుభ్రపరిచే 7 నిమిషాల అద్భుతం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.. అక్కడ బుల్లెట్ రైళ్లు త్వరగా తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతాయి.. పాన్ రైలు సేవల సమయపాలనకు ప్రసిద్ధి చెందింది.. జపాన్‌లోని క్లీనింగ్ సిబ్బంది కేవలం 7 నిమిషాల్లో బుల్లెట్ రైలును శుభ్రపరిచే అద్భుతాన్ని నెలకొల్పారు.. వందే భారత్ రైళ్ల కోసం 14 నిమిషాల అద్భుతం జపాన్‌షింకన్‌సేన్ పద్ధతి నుంచి ప్రేరణ పొందింది’ అని మరొక రైల్వే అధికారి వ్యాఖ్యానించారు.

కాగా, గతవారం ఒకే రోజున 9 వందేభారత్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ రైళ్లలో ప్రయాణికుల నుంచి వచ్చిన సలహాలు, సూచనల ఆధారంగా పలు మార్పులు చేశారు. సీటు రీక్లైనింగ్ నుంచి మొబైల్ ఛార్జింగ్ పాయింట్ల వరకూ మొత్తం 25 ఫీచర్లను మార్పులు చేసినట్టు అధికారులు తెలిపారు. కోచ్‌లలో సీటు రిక్లైనింగ్ యాంగిల్‌ను 17.31 డిగ్రీల నుంచి 19.37 డిగ్రీలను పెంచారు.

  • October 01 , 2023
  • 10:37 am