×

ప్రపంచ మొత్తాన్ని 12 రోజుల్లో మ్యాపింగ్ చేసేలా నిర్మాణం.. ISRO NASA అమెరికా నుంచి భారత్‌కు చేరిన ‘నిసార్’..

లలితా పీఠం విశాఖ : అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (NASA), భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) సంయుక్తంగా రూపొందించిన ఉపగ్రహాన్ని (Satellite) త్వరలో నింగిలోకి పంపనున్నారు. ఇందుకోసం ఈ ఉపగ్రహం అమెరికా వాయుసేనకు చెందిన సీ-17 (C-17)ప్రత్యేక రవాణా విమానంలో బెంగళూరుకు చేరుకుంది. నాసా-ఇస్రో సింథటిక్ అపార్చర్ (NISAR) అనే పేరుతో పిలిచే ఈ ఉపగ్రహాన్ని శ్రీహరికోట (Sriharikota)నుంచి ఇస్రో ప్రయోగించనుంది. నిసార్ సాయంతో ప్రపంచవ్యాప్తంగా భూమి ఉపరితలంపై మంచు ప్రాంతాల్లో జరిగే మార్పులను పరిశీలించనున్నారు.

భూమి పొరల్లో జరిగే కదలికలు, భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనాలు, సముద్రమట్టం పెరుగుదల, సునామీల వంటి ప్రకృతి వైపరీత్యాలకు కారణమయ్యే పరిస్థితులు, వాటి ముందస్తు సంకేతాలను గుర్తించేందుకు నిసార్‌ ఉపగ్రహం అందజేసే సమాచారాన్ని పరిశోధకులు ఉపయోగించనున్నారు. ఈ ఉపగ్రహం సాయంతో హిమాలయాల్లోని హిమనీనదాల ప్రవాహ తీరు, మంచుచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాలను ఇస్రో శాస్త్రవేత్తలు పర్యవేక్షించనున్నారు. ఎస్‌యూవీ వాహనం పరిమాణంలో ఉండే ఈ ఉపగ్రహం బరువు 2,800 కిలోల ఉంటుందని నాసా పేర్కొంది.

ఈ ఉపగ్రహంలో ఎల్‌-బ్యాండ్‌, ఎస్‌-బ్యాండ్, సింథటిక్ అపార్చర్ రాడార్ (SAR) వంటి పరికరాలు ఉన్నాయి. ఇవి ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా మేఘాలు, దట్టమైన అడవుల్లో కూడా హై-రిజల్యూషన్‌ ఫొటోలను సేకరించే సామర్ధ్యం దీనికి ఉంది. ఈ భూ దిగువ కక్ష్య ఉపగ్రహం ప్రపంచ మొత్తాన్ని ఇది 12 రోజుల్లో మ్యాపింగ్ చేసి సమాచారాన్ని అందజేయగలదని ఇస్రో పేర్కొంది.

2021 తొలినాళ్ల నుంచి నిసార్‌లోని రెండు రాడార్ వ్యవస్థలను దక్షిణ కాలిఫోర్నియాలో ఉన్న జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీకి చెందిన టెక్నీషియన్లు, ఇంజినీర్లు అమర్చి, పరీక్షిస్తున్నారని నాసా గత నెలలో వెల్లడించింది. దీనిలో ఎల్- బ్యాండ్‌ను జేపీఎల్, ఎస్-బ్యాండ్‌ను ఇస్రో రూపొందించాయి. బెంగళూరుకు చేరుకున్న ఈ ఉపగ్రహం తుది పరీక్షలను యూఆర్ రావు శాటిలైట్ కేంద్రంలో నిర్వహిస్తారు. వచ్చే ఏడాది శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం (Satish Dhawan Space Centre) నుంచి ఈ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.

  • March 09 , 2023
  • 08:51 am