×

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆ ఆంక్షలన్నీ తొలగింపు, పూర్తి వివరాలివే

తిరుమల ఘాట్ రోడ్లలో బైక్‌ల రాకపోకలపై విధించిన ఆంక్షలను టీటీడీ సడలించింది. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం సాయంత్రం టీటీడీ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈవో ఏవీ ధర్మారెడ్డి ఈ మేరకు ప్రకటించారు. అలిపిరి కాలినడక మార్గంలో చిరుతల సంచారంతో భక్తుల భద్రత దృష్ట్యా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను టీటీడీ నిలిపివేసిన విషయం తెలిసిందే.

 

టీటీడీ అటవీశాఖతో అధికారులతోపాటు రాష్ట్ర అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతంలో ఆరు చిరుతలను బంధించడంతో పాటు వారం రోజుల పాటు పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎలాంటి ముప్పు లేదని నిర్ధారించారు. దీంతో శుక్రవారం నుంచి ఘాట్ రోడ్లలో రాత్రి 10 గంటల వరకు ద్విచక్ర వాహనాలను అనుమతించనున్నారు.అదేవిధంగా, అక్టోబరు 14న అంకురార్పణ, అక్టోబర్‌ 15 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల సంసిద్ధతపై శాఖల వారీగా అధికారులతో ఈవో సమీక్షించారు. దసరా సెలవుల కారణంగా యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని.. తగిన ఏర్పాట్లు చేసి, అధికారులు సమన్వయంతో సాలకట్ల బ్రహ్మోత్సవాల తరహాలో విజయవంతం చేయాలని కోరారు.

  • September 30 , 2023
  • 10:39 am